Manabadi-classes-started

విజయవంతంగా మొదలైన మనబడి విద్యా సంవత్సరం

విదేశాల్లో తెలుగు భాషను ప్రవాసాంధ్రుల పిల్లలకు అందిస్తున్న మనబడి 2016-17 విద్యా సంవత్సరం తరగతులు సెప్టెంబర్ 10 నుంచి అమెరికా వ్యాప్తంగా 35 రాష్ట్రాలలో, 12 దేశాలలో 275 కి పైగా ప్రాంతాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి.  దాదాపు 6500 మంది విద్యార్ధులు ఈ తరగతులకు నమోదు చేసుకున్నారు. సిలికాన్ వ్యాలీలోని ఫ్రీమాంట్ హై స్కూల్ లో మనబడి తెలుగు తరగతులను ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ లాంచనంగా ప్రారంబించారు. సిలికానాంధ్ర మనబడిని చూశాక తెలుగు భాష భవిష్యత్తు మీద భరోసా మరింత పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. మాతృదేశానికి దూరంగా ఉన్నా మాతృభాష నేర్చుకోవాలన్న తపన ఉన్న తల్లితండ్రులకు, వారికి తెలుగు నేర్పుతున్న మనబడి బృందానికి అభినందనలు తెలిపారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తిని చాటాలన్న ఏకైక లక్ష్యంతో సిలికానాంధ్ర పని చేస్తోందని, ఆ కార్యాచరణలో భాగంగానే 10 సంవత్సారల క్రితం మనబడి ప్రారంభించామని , రాజు చమర్తి నేతృత్వం లో ఆ దిశగా ఎన్నో విజయాలు సాధిస్తున్నామని అన్నారు.
 

మనబడి డీన్ రాజు చమర్తి మాట్లాడుతూ, తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, వాస్క్ ఎక్రిడిటేషన్, పలు స్కూల్ డిస్ట్రిక్ట్ లలో ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు లాంటి అనేక విజయాలు సొంతం చేసుకున్న ఏకైక తెలుగు విద్యావిధానం సిలికానాంధ్ర మనబడి అని, ఇక్కడ తెలుగు నేర్చుకున్న పిల్లలు వారి వారి రంగాలలో ఎంతో ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, 10 సంవత్సరాలుగా మనబడి ద్వారా 25000 మందికి పైగా పిల్లలకు తెలుగు నేర్పించామని, తెలుగు భాషను ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా అందించే భాషా సారధులు మనబడి విద్యార్ధులే ముందుంటారని  అన్నారు.

అమెరికా వ్యాప్తంగా 275 కి పైగా ప్రాంతాలలో ప్రారంభమైన సిలికానాంధ్ర మనబడి లో ప్రవేశం కావాలనుకున్న వారు వెంటనే manabadi.siliconandhra.org ద్వారా  ఈ నెల 23 వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని  లేదా   1-844-626-2234 కు కాల్ చేయవచ్చని మనబడి ఉపాద్యక్షులు  దీనబాబు కొండుభట్ల తెలిపారు. మనబడి విజయాలకు కారణమైన విద్యార్ధులు, తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

లాస్ ఏంజిలస్‌లో డాంజి తోటపల్లి, న్యూజెర్సీ లో శరత్ వేట, డాలస్ లో భాస్కర్ రాయవరం, సిలికాన్ వ్యాలీలో దిలీప్ కొండిపర్తి, సంజీవ్ తనుగుల శాంతి కూచిభొట్ల, అనిల్ అన్నం, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, లక్ష్మి యనమండ్ల, జయంతి కోట్ని,  శ్రీరాం కోట్ని , ఫణి మాధవ్ కస్తూరి తదితరుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల మనబడి ఉపాధ్యాయులు, సమన్వయకర్తల సహకారంతో మనబడి నూతన విద్యా సంవత్సర తరగతులు ప్రారంభమయినాయి.